(Telugu) కొంగ-ఎండ్రకాయ కథ

[:te]ఒక చెరువులో చాలా చేపలున్నాయి. ఒక కొంగ ఆ చేపలను ఎలాగైనా చంపి తినాలనుకొంది. ఆ చెరువులో వాలగానే తమను వేటాడి తినే పక్షి వచ్చిందని చేపలన్నీ దూరంగా పరుగెత్తి నీట మునిగేవి. కొంగ తలవంచి కండ్లు మూసి నాలుగు రోజులు తపస్సు చేస్తున్నదానిగా నటించసాగింది. చేపలు దగ్గరకు వచ్చినా ముట్టుకోలేదు. చేపలకుదాని వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది.

ఆ చెరువులో నివసిస్తున్న ఒక ఎండ్రకాయ కొంగను చూచి "కొంగబావా! కాళ్ళ దగ్గరకి వచ్చిన చేపలనైనా ముట్టక నీవెట్లు బతికెదవు? ఇక్కడ ఒంటి కాలుపై నిలిచి కనులు మూసుకొని నీవేమి చేయుచున్నా"వని అడిగింది. అపుడా కొంగ జీవహింస మహాపాపమని పెద్దలు చెప్పగా విన్నాను. ఇంతకాలం తెలియక ఎన్నో చేపలను తిన్న పాపం పోవాలని తపస్సు చేయుచున్నాను. మాంసాహారం పూర్తిగా మానేశాను. ఆకు, అలం తిని నీరు తాగి కాలం గడుపుతున్నాను. అందుకే మీ వంకైనా చూడటం లేదు" అని చెప్పింది.

కొంగ మాటలను చేపలు నమ్మాయి. ఆనాటి నుండి అవి నిర్భయంగా కొంగ చుట్టూ తిరిగేవి. కొంగ వాటికెన్నో కబుర్లు, కథలు, మరెన్నో విషయాలు చెప్పసాగింది. తన మీద వాటన్నిటికీ గురి కుదిరేలా ప్రవర్తించేది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు కొంగ కన్నీరు కారుస్తూ చేపలతో "మీకు కష్టకాలం రానున్నది. నిన్న జాలరులుచెరువుని చూచి చెరువులో నీరు తగ్గింది, నాలుగు రోజుల తర్వాతవచ్చి వలలు పన్ని నీరు చిమ్మి చేపలను పట్టుకుందామని చెప్పుకుంటే విన్నాను. నాకేముంది, ఎక్కడికైనా క్షణంలో ఎగిరిపోగలను. మీ ప్రాణాలెలా కాపాడాలని ఆలోచిస్తున్నాను. ఇంతలో ఒక ఉపాయం తట్టింది. ఇక్కడికి సమీపంలో ఆ కొండ అవతల ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడకు మిమ్ములను నా నోట కరుచుకొని పైకెగిరి వేగంగా వెళ్లి ఆ సరస్సులో దింపి వస్తాను. అంతకంటే నేను చేయగల సహాయం ఏదీ లేదు, తర్వాత మీ ఇష్టం" అని చెప్పింది.

చేపలు దాని మాటలు నమ్మాయి. తమనెలాగైనా కాపాడమన్నాయి. నాటి నుండి కొంగ తడవకు నాలుగైదు చేపలను ముక్కున కరచుకొని కొండవైపుగా వెళ్లి అక్కడొక పెద్ద బండమీద వాటిని పెట్టి తినసాగింది. తమ స్నేహితులందరూ క్షేమంగానే ఉన్నారని కొంగ చేపలకు చెపుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు చేపలతో పాటు ఎండ్రకాయ కూడా తననూ సరస్సులో చేర్చమని కోరింది. కొంగ సంతోషంగా సరే అని చేపలను ముక్కున కరుచుకొంటాను. నీవు గట్టిగా నా మెడ పట్టుకో, నేను విడవమనగానే విడిచేయమని చెప్పింది. కొంగ మెడ చాపింది, ఎండ్రకాయ దాని మెడ గట్టిగా పట్టుకుంది.

కొంగ పైకెగిరి తాను చేపలను తినే బండ దగ్గరకు వచ్చింది.ఎండ్రకాయకు అనుమానం వచ్చి వాలింది. అటూ ఇటూ చూసింది. అక్కడ ఎలాంటి చెరువుగాని, సరస్సుగాని కనపడలేదు. పైగా కొండ వద్ద బండ మీద చేపల పొలుసులు, వాటి ఎముకలు దానికి కనిపించాయి. ఇన్నాళ్ళూ కొంగ చేసిన మోసం దానికి అర్థం అయింది. "కొంగజపం"అంటే ఇదే కాబోలు. దొంగ కొంగ తీపి మాటలు చేపలన్నింటినీ మోసగించి పొట్టన పెట్టుకుంది. నేను పట్టు వదిలితే నన్ను పట్టుకొని చంపి తినక మానదు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు. దీని మెడ నా కొండెలతో కత్తిరించి చంపేస్తా"నని ఎండ్రకాయ కొంగ గొంతు పట్టి కొరికి చంపింది. కొంగ పీడా వదిలించుకొని నెమ్మదిగా చెరువు వద్దకు చేరి బతికి బయట పడింది.

పాపం కొంగ చేపలను తినడానికి పన్నిన ఉపాయం దానికి అపాయంగా మారింది. కాబట్టి ఉపాయం పన్నేటపుడు దానివల్ల ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్త వహించాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. మంచి ఉపాయం ఆలోచించి మీకు శత్రువైన పామును చంపేయండి" అని నక్క సలహా ఇచ్చింది.

కాకులు నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాయి. కాకులు నివశిస్తున్న దగ్గరలో రాకుమార్తె ఉద్యానవనముంది. ఆ సమయమున రాకుమార్తె చెలికత్తెలతో కోనేటి స్నానం చేస్తుంది. ఇదే మంచి సమయమని భావించి మగకాకి వెళ్లి ఆమె కంఠహారాన్ని ముక్కున కరుచుకొని పైకెగిరింది. రాజభటులు అది చూచి, కాకిని వెంబడించారు. కాకి నెమ్మదిగా వారికి చిక్కక ఎగురుచుండగా ఆ హారాన్ని పాము పుట్టలో పడవేసింది. అది గమనించిన రాజభటులు పుట్ట తవ్వి, పామును చంపి కంఠహారాన్ని తీసుకొని వెళ్ళారు.

ఈ విధంగా మంచి ఉపాయంతో కాకులు తమ శత్రువుని తేలికగా చంపి హాయిగా జీవించాయి. దేహబలం కంటే బుద్ధి బలం గొప్పది. బుద్ధిలేని వానికి ఎంత బలమున్నా ఏం లాభం? ఏనుగు కొండంత ఉంటుంది. చిన్న మావటివాడు దానిని లొంగదీస్తున్నాడు కదా! ఉపాయశాలి అయిన కుందేలు మృగరాజైన పెద్ద సింహాని చంపింది. అనగానే కరటకుడు ఏమేమి? సింహాన్ని కుందేలు చంపిందా? అదెలా జరిగింది? ఆ కథేంటో నాకు వినిపించు అనిన అడిగాడు. అపుడు దమనకుడు కథ చెప్పటం ప్రారంభించింది.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము