(Telugu) ఒంటె-సింహం కథ

[:te]ఒక అడవిలో ఒక సింహం నివశిస్తున్నది. అది ఆ అడవిలోని జంతువులన్నింటికీ రాజు. దానికి సలహాలిచ్చేవి "పులి, నక్క, కాకి". మంచితనమే తప్ప లౌకికం తెలియని నా లాంటి ఒంటె ఒకటి ఒకనాడు వాని కంట పడింది. పులి, నక్క, కాకి మూడూ కలిసి దాని వద్దకు వెళ్ళి "ఎవరు నీవు? ఈ అడవికిఎందుకు వచ్చావు?" అని అడిగాయి. అపుడు ఒంటె "అయ్యా! నా యజమాని పెట్టె బాధలు పడలేక నేనీ పక్క గ్రామం నుండి ఈ రోజేవచ్చాను. దిక్కు లేని దానను. నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి" అని వాటితో అన్నది.

అలాగే, భయపడకు! నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము. మా రాజు ఎంతో మంచివాడు. ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాము. మా వెంట రా! అని అవి మూడు ఒంటెను తీసుకొని సింహం వద్దకు వెళ్ళాయి. "ప్రభూ! ఇతడు మా వలెనే తమను సేవించడానికి కొత్తగా మన వనానికి వచ్చాడు. మంచి బలం కలవాడు, బుద్ధిమంతుడు. దుడుకుతనమెరగని సాధు స్వభావుడు" అని గొప్పగా పొగిడాయి. సింహం ఒంటెను కుడా తన మంత్రులలో ఒకనిగా నియమించింది.

క్రమక్రమంగా ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చింది. అది ఒంటెను ఆప్తమిత్రునిగా భావించి తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేసింది. నిన్నగాక మొన్న వచ్చిన ఒంటె ప్రధాని అయిందని ఈర్ష్యతోపులి, నక్క, కాకి దానిని ద్వేషించసాగాయి. సమయం చూచి దానికి హాని తలపెట్టాయి.

ఒకసారి సింహానికి జబ్బు చేసి కదలలేని పరిస్థితి ఏర్పడింది. అపుడు పులి, నక్క, కాకి జంతువులను వేటాడి తెచ్చి సింహానికి ఆహారంగా పెట్టేవి. ఒకనాడవి ఎంత వేటాడినా ఒక్క జంతువు దొరకలేదని అవి విచారంగా సింహంతో చెప్పాయి. తాము పన్నిన ఉపాయంతో కాకి "తమవంటి ప్రభువులకు ఉపయోగపడని ఈ శరీరమెందులకు? మీ ఆకలి బాధ చూడలేకున్నాను. నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి" అన్నది. అపుడా సింహం "నీ వంటి అల్ప జీవులను చంపితే నా ఆకలి తీరుతుందా? నీ మాంసం నాకు ఒక పంటి కిందకు కుడా చాలదు" అనుచుండగా నక్క "ప్రభూ! నన్ను చంపి భక్షించి మీ ఆకలి బాధ చల్లార్చుకోండి" అన్నది. అందుకు సింహం "ఎంత చేతకాకున్నా నీ వంటి క్షుద్ర జంతువులను చంపి తింటానా! కుక్కలు, నక్కలు జంతువులలో నీచమైనవి. చచ్చిన శవాలను పీక్కుతిను నక్క ఈ రాజుకు భోజనమా? నిన్ను చంపి తినడం కంటే ఆకలితో చావటం మేలు అని పలికింది.

అపుడు పులి "మహారాజా! నన్ను తినండి. ఇన్నాళ్ళుగా మీకు సేవ చేసిన నేను మీరు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిల్తే చూడలేను" అన్నది. అపుడు సింహం పులితో "ఓరీ! నీవు గోవులు, మేకలు, కుందేళ్ళు వంటి సాధు జంతువులను తిన్న మహా పాపివి. నిన్ను ముట్టుకోవడమే ఎంతో పాపం. నిన్ను నేను భక్షించను" అని పలికింది. తరువాత ఒంటె, రాజు వద్దకు పోయి "సింహరాజా! నా శరీరం ఎంతో పెద్దది. నన్ను భక్షిస్తే మీ ఆకలి పూర్తిగా తీరుతుంది. కాబట్టి సందేహించక నన్ను తినండి" అన్నది. సింహం మిత్రద్రోహం చేయడానికి తటపటాయిస్తుంది. ఆ సంగతి గమనించిన కాకి "మహారాజా! మీరు మా ముగ్గురిని తినడానికి ఒప్పుకోలేదు. సరే ఇతని ప్రార్థననైనా మన్నించి తమ ఆకలి తీర్చుకోండి. ఆకలి బాధకాగలేక సర్పం తన పిల్లలని తానే తిని ఆకలి తీర్చుకుంటుంది. దేహాన్ని రక్షించుకొనటం ప్రతి ప్రాణికీ ముఖ్య కర్తవ్యం కదా! మీ వంటి ప్రయోజికులు బతికి ఉంటే పదిమందికి లాభం కలుగుతుంది. మా వంటి అప్రయోజికులు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే కదా!" అని చెప్పింది. నక్క, పులి కూడా ఆ మాటలనేసమర్ధించాయి. ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగింది. "మీకు తోచినట్లు చేయండి" అన్నది. సింహం వెంటనే ఒంటెపై పడి చంపింది. సింహం ఒంటె మాంసం తిని ఆకలి బాధ తీర్చుకుంది. తమ పాచిక పారినందుకుపులి, నక్క, కాకి ఎంతగానో సంతోషించాయి.

కాబట్టి కొత్తగా వచ్చిన సేవకులు ఎంత మంచి వారైనా తోటి వారందరికీ ఏదోక కీడు చేయాలని చూస్తారు. రాజునకు ఏవో మాయమాటలు కల్పించి చెపుతారు. అలాంటి నీచుల మాటలు నమ్మిన రాజు కూడా పరమ నీచుడే అవుతాడు. "దుష్టులతో స్నేహం చేయకూడదు. దుష్టబుద్ధులతో వచ్చావు కాబట్టి నేను భయంతో చెట్టెక్కాను" అని ఒడ్రంగి మునుపొక సింహానికి చెప్పాడు. ఆ కథ చెపుతాను విను అంటూ కథ చెప్పటం ప్రారంభించాడు.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము