(Telugu) నక్క-భేరీ కథ

[:te]ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి వివిధరకాల మాంసాలు తినడం మహా ఇష్టం. తన తెలివితేటలతో రకరకాల మాంసాలు సంపాదించుకొని తినేది. అది స్వయంగా పెద్ద జంతువుల్ని చంపలేదు. కాబట్టి చనిపోయిన కళేబరాలను కాని, సింహమో, పులో చంపి తిని వదిలిన మంసాలను ఆరగిస్తూ ఉండేది. ఒకనాడు దానికి ఆహారం దొరకలేదు. ఆహారం వెదుకుచూ బయలు దేరి ఒక యుద్ధభూమికి చేరింది. అక్కడ ఎన్నో శవాలు మానవులవి, గుర్రాలవి, ఏనుగులవి కనబడ్డాయి. వాటిని చూచి తన పంట పండిదని నక్క ఎంతగానో పొంగిపోయింది. దాని ఆనందానికి హద్దులు లేవు.

ఇంతలో దానికి "ఢం-ఢం, గర్-గర్" అనే శబ్దాలు వినిపించాయి. అదేదో క్రూర జంతువు కోపంతో అరిచినట్లు తలిచి భయపడింది. ఒక బండ పక్కన దాగి కొంతసేపు ఆగి చూచింది. ఏ జంతువూ అటుగా రాలేదు. నక్క కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక చెట్టు చాటున నక్కి చూసింది. అక్కడ ఒక చెట్టు కింద యుద్ధభేరి ఉంది. గాలికి చెట్టుకొమ్మ ఒకటి దానికి తగలటం వల్ల చప్పుడైందని గ్రహించింది. "ఓరి దేవుడా! ఈ భేరి నన్నెంతగా హడలగొట్టిందీ! ముందు దీని పని పట్టా"లని దానిపై గల చర్మాన్ని కొరికి తిన్నది. తర్వాత అక్కడున్న ఆహారాన్ని కడుపారా కొన్నాళ్ళు ఆరగించింది.

మహారాజా! నిజము తెలుసుకోక అదేదో జంతువని భయపడి ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోతే చేజిక్కిన ఆహారం పోగొట్టుకొనేదే కదా! కాబట్టి శబ్దం విన్న మాత్రాన భయపడటం మంచివారి లక్షణం కాదు. మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వెళ్లి అదేమిటో తెలుసుకొని వస్తాను అని కరటకుని వద్దకు వెళ్లి విషయం తెలియజేయగా, కరటకుడు పరాధికారం పైన వేసుకుంటున్నావ్. కుక్క పని గాడిద చేయబోయి తన్నులు తిని మరణించింది. ఆ కథ చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.

చాకలి-కుక్క-గాడిద
ఒక గ్రామంలో "ధావకమల్లుడు" అనే చాకలి ఉండేవాడు. అతడొక గాడిదని, కుక్కని పెంచుతున్నాడు. గాడిద చాకిరేవుకి బట్టలన్నీ మోస్తుండేది. అందువలన గాడిదదే ఎక్కువ కష్టం అని దానికి ఎక్కువ తిండి పెట్టేవాడు. కుక్కేముంది? దున్నలా తిని పడుకోడమే కదా! అని చాకలికి అనిపించింది. అందువలన కుక్కకి సరిగా ఆహారం పెట్టడం మానేసాడు. గాడిదని బాగా మేపుతున్నాడు. యజమాని చూపుతున్న ప్రవర్తనకు కుక్కకు చాలా కోపం వచ్చింది.

ఒకరోజు అర్థరాత్రి చాకలి గుర్రుపెట్టి నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగ వాని ఇంట్లో ప్రవేశించి బట్టలన్నీ మూటగట్టుకొనుచున్నాడు. అది చూచి గాడిద కుక్కతో "మిత్రమా! చూశావా! దొంగ ఇంటిలో దూరి మనయజమాని సొమ్మును, ఊరి వారి బట్టలను కాజేయుచున్నాడు" అన్నది. ఆ మాటలను వినిన కుక్క "నేనెప్పుడో చూశాను. కాని నాకు కడుపు నిండాతిండి కూడా పెట్టకుండా మాడుస్తున్న మన యజమానికి తగిన శాస్తి జరగాలి. అందుకే నేను మొరగను" అన్నది. వెంటనే గాడిద "నీవు మొసగాడివి, నీ పని నేను చేయాలేననుకున్నావా? నాకూ నోరుంది. నేనూ అరవగలను చూడు, మన యజమానిని మేలుకొలిపి దొంగను పట్టుకొనేలా చేస్తాను" అని చెప్పి పెద్దగా ఒండ్రు పెట్టింది. దొంగ చేతికి చిక్కిన సొమ్ము, బట్టల మూట తీసుకొని పారిపోయాడు.

రోజంతా రెక్కలు నొప్పులు పుట్టేలా బట్టలుతికిన బడలికతో గుర్రు పెట్టి నిద్రిస్తున్న చాకలి తనకు నిద్రాభంగం కలిగిందన్న కోపంతో లేచి గాడిదను పెద్ద కర్రతో చావబాదాడు. ఆ దెబ్బలకు గాడిద మరణించింది. కాబట్టి "పరాధికారం పైన వేసుకొని రాజోద్యోగులెవరో చేయాల్సిన పనిని నీవు నిర్వర్తించడం నాకు నచ్చలేదు. నీవు నా సోదరుడవు కాబట్టి చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం" అని కరటకుడు దమనకునితో చెప్పాడు. కరటకుడు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి దమనకుడు కరటకునితో పాటు సంజీవకమును సమీపించి ఈ విధంగా మాట్లాడాడు.

"ఈశ్వరుని వాహనమైన నందీశ్వరుని వంటి ఓ వృషభరాజా! నీకు నమస్కారం. ఈ అడవంతటికీ రాజు "పింగళకుడు" అనే సింహం. మేమిద్దరం ఆ రాజుగారి ప్రతినిధులం. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ అడవిలో ఇంతవరకూ ఏ మృగం స్వేచ్ఛగా తిరగటానికి వీలులేదు. ఈ రోజు నీ అరుపు విని రాజుగారు ఎవరో కొత్తగా వచ్చిన వారు కాబోలు, మన విషయం వారికి తెలిసి ఉండదు. మీరు వెళ్లి నచ్చజెప్పి మన వద్దకు తీసుకురండి. మేము వారిని సన్మానించి వారితో స్నేహం చేస్తా"మని మమ్ములను పంపారు. తమరు మా వెంట వస్తే మేము మిమ్ములను వారికి పరిచయం చేసి స్నేహం చేయిస్తాము" అని పలికింది. దమనకుని మాటలు విన్న సంజీవకం ఆలోచించి దిక్కులేకుండా అడవిలో తిరుగుతూ ఏ పులినోట్లోనో పడే కంటే రాజదర్భారులో చేరి రాజుగారి స్నేహితునిగా ఉండడం మంచి"దని సరే వెళ్దాం పదండి అని వారి వెంట బయలుదేరి పింగళకం వద్దకు వెళ్ళింది.

సంజీవకం కరటకునితో కబుర్లాడుతూ నెమ్మదిగా వస్తుంటే దమనకుడు ముందుగా గబగబా పింగళకుని వద్దకు పరుగెత్తి "మహారాజా! మనకు భయం కలిగేలా శబ్దం చేసిందెవరో కాదు. "సంజీవకం" అనే వృషభేంద్రుడు. అతడెంతో మంచివాడు, తెలివైన వాడు, బలవంతుడు. మీకు మంత్రిగా ఉండతగిన వాడు. సెలవైతే వెళ్లి అతణ్ణి తమ సన్నిధికి తీసుకొస్తాను" అని చెప్పింది. పింగళకుడు అలాగే తీసుకొనిరా అన్నాడు.

దమనకుడు సంజీవకాన్ని తీసుకువచ్చి పింగళకుని ముందు నిలిపాడు. సంజీవకం మృగరాజునకు నమస్కారం చేసి, మహారాజా! మీ అనుమతి లేకుండా నేనీ అడవిలో ప్రవేశించాను. ఇష్టానుసారంగా ప్రవర్తించాను. ఇది నేను తెలియక చేసిన తప్పు. కాబట్టి నన్ను క్షమించండి" అని అనగానే పింగళకుడేంతో సంతోషించాడు. "సంజీవకా! భయపడకు. నేటి నుండి నీవు నా మిత్రుడవు, అంతే కాదు ఇప్పటినుండి నీవు నా మంత్రిగా ఉండు. నీ ఇష్టానుసారం ఈ అడవంతా తిరుగు, నా హితుడవుగా సచివుడుగా సర్వ మర్యాదలు అందుకో" అన్నాడు.

ఆనాడు మొదలుకొని పింగళకుడు పలువిధాలగాకొనియాడుతూ రోజురోజుకూ అతనితో స్నేహాన్ని పెంచుకొని వానిని ఆదరిస్తూ తన బంధుమిత్రులను సరిగా చూడక అశ్రద్ధ వహించటం మొదలు పెట్టాడు. తమ రాజు ఇలా అవడానికి వారంతా ఎంతాగానో విచారించారు. కరటక దమనకులకు కూడా రాజుగారు సంబంధం చాలా వరకు తగ్గింది. ఒకనాడు కరటకుడు "ఎద్దును తెచ్చి గద్దెనెక్కించింది నేను. అది మరచి సంజీవకం తనకు మేలు చేశామనే విశ్వాసం కూడా లేకుండా మనలను నిరుత్సాహపరుస్తుంది. పింగళకం కూడా గౌరవించడం లేదు సరికదా, మాట్లాడాలన్నావారిరువురూ ఇంకొకరికి అవకాశం ఇవ్వట్లేదు. మనకే కాదు మునుపటి రాజమిత్రులకూ, బంధువులకు కూడా మనం చేసిన పని వల్ల కష్టమే కలిగింది. నేను ముందుగానే "మనకెందుకంటే నీవు వినలేదు. దీనికంతకు నీవే కదాకారణం!" అని దమనకునితో అన్నాడు.

దానికి దమనకుడు "తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది" అనే సామెత నా విషయంలో నిజమైంది. ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా? నేను పొందతలిచిన మంత్రి పదవి సంజీవకంనకు దక్కింది. నా పాచిక పారలేదు. చేతులారా చేసుకున్న అపరాధానికి నక్క, సన్యాసి దేవశర్మల మాదిరిగా నేనూ మోసపోయాను. నీకా కథ చెపుతాను విను అనిదమనకుడు కథ చెప్పటం ప్రారంబించాడు.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము