(Telugu) చిత్రాంగుని కథ

[:te]"మిత్రులారా! నేను ఆరునెలల వయస్సులోనే వేటగానికి చిక్కాను. బంధుమిత్రులు నన్ను చూచి ఎంతో దుఃఖించారు. వేటగాని రాకతో భయపడి పారిపోయారు. వారికోసం ఎంతగానో విలపిస్తూ ఉంటే, వేటగాడు నన్ను తన భుజానిపై వేసుకొని అతని ఇంటికి వెళ్ళాడు. అతడు నన్ను బాధించలేదు. నాతల నిమురాడు, ముద్దులాడి మేత పెట్టాడు. నా దగ్గరే పడుకున్నాడు. మరునాడు నన్నొక రాజకుమారుని దగ్గరుకు తీసుకెళ్ళి, ఆయనకు నన్ను కానుకగా ఇచ్చాడు. రాకుమారుడు సంతోషంతో నన్నెంతగానో మెచ్చుకున్నాడు. తల నిమిరి బుజ్జగించాడు. వేటగానికి మంచి బహుమానం ఇచ్చి పంపాడు. ఆ తరువాత నన్నొక శాలలో పెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగాడు రాకుమారుడు. రాజభటులు నాపై ఈగ కూడా వాలకుండా కాపాడుతూ ఉండేవారు. నాకు రోజూ మంచి ఆహార పదార్థాలు పెడుతూ ఉండేవారు. ఆ విధంగా క్రమక్రమంగా నాకు మనుషుల మీద భయం పోయి, వారికి మచ్చికయ్యాను. కొన్నాళ్ళకు నేను పారిపోననే నమ్మకంతో రాకుమారుడు నా ఇష్టం వచ్చినట్లు తిరగనిచ్చాడు. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఎక్కడ తిరిగినా నన్ను అందరూ ఆదరించేవారే కాని అదలించేవారు లేరు. కోటంతా తిరిగి చూశాను, ఉద్యానవనాలలో విహరించాను. ఒకనాడు పట్టణం చూడాలని బుద్దిపుట్టింది. వెంటనే కోట నుండి బయటపడి చెంగు చెంగున ఎగురుతూ వీధులలో గెంతులు వేయుచున్నాను. రాకుమారుడు నా మెడలో కట్టించిన బంగారు మువ్వలు, కాళ్ళ గజ్జెలు గల్లుగల్లుమని మొగుచుండగా పిల్లలూ, పెద్దలూ నా వెంటపడ్డారు. నేను వారికి భయపడి వేగంగా పరిగెత్తుతూ రాణీవారు నివశించుచున్న ఉద్యానవనంలోకి వెళ్ళాను.

అంతఃపురం కాంతలు నన్ను పట్టుకొని ముద్దులాడి, కొంతసేపు నాతో ఆడుకొని చీకటి పడుతున్నదని నన్ను తమతో కోటకు తీసుకొని వెళ్ళారు. రాత్రివేళ నన్ను వారురాజపుత్రుని పడకగది సమీపమునగల ఒక స్తంభమునకు కట్టారు. నడిరేయి మంచినిద్రలో ఉండగా మెరుపులతో, ఉరుములతో పెద్ద పెద్ద వర్షం కురవసాగింది. నాకు చిన్నప్పటినుండి వానంటే ఎంతో ఇష్టం. సంతోషంతో నేను మానవ భాషలో "ఆహా! మెరుపు కాంతులతో మబ్బులెంత అందంగా ఉన్నవి. చిన్నప్పుడు వానలో తడుస్తూ స్నేహితులతో కలిసి ఆడుతూ, పాడుతూ ఎంత సంతోషించేదాన్ని, ఆ రోజులు మరల రావు కదా! అనుకొంటిని.

నా మాటలు రాకుమారుడు విని, అతడు ఆశ్చర్యంతో తన మందిరం నుండి బయటకు వచ్చి, "ఈ జంతువు మనుష్యుల భాషలో మాట్లాడుటెంతో విచిత్రముగా ఉన్నది" అనుకున్నాడు.మరునాడు జ్యోతిష్కులను పిలిపించి రాత్రి జరిగిన విషయం వారికి చెప్పాడు. వారు "రాకుమారా! ఈ జంతువు మానవ భాషలో మాట్లాడిందా, అయితే దీనినిఅంతఃపురమున ఉండనీయరాదు, పెద్ద కీడు జరుగుతుంది. కాబట్టి మాట్లాడే ఈ లేడిని వెంటనే అడవిలో వదిలేయండి" అన్నారు. భటులు రాకుమారుని ఆజ్ఞతో నన్నీ అడవిలో వదిలారు. ఈ విధంగా నేను మళ్ళీ అడవికి వచ్చాను, నా బంధువులెవరైనా కన్పిస్తారనే ఆశతో తిరుగుతున్నాను. ఒక వేటగాడు నన్ను చూచి వెంటబడ్డాడు. అదృష్టం కొద్ది అతణ్ణి తప్పించుకొని వేగంగా పరుగెత్తి వచ్చి మీ శరణు కోరాను, మీరు నన్నాదరించి నా ప్రాణాలను కాపాడారు" అని తన కథని ముగించింది.

చిత్రాంగుని కథ విన్న ఎలుక, కాకి "త్వరగా వెళదాం పదండి, మనకోసం మందరుడు ఎంతగా విచారించుచున్నాడో?" అన్నాయి. చిత్రాంగుడు, లఘుపతనకము, హిరణ్యకులు మాట్లాడుకొంటూ వస్తుండగా, వారిని వెతుక్కుంటూ మందరుడుఎదురగా వచ్చాడు. హిరణ్యకుడు, మిత్రమా నీవిలా వస్తావనే గబగబా మేమే వస్తున్నాము. తొందరపడి నీవెందుకు వచ్చావు. భూమిపై నీవు గబగబా నడవలేవు కదా! తొందరపడి రావటం దేనికి, దారిలో ఏ శత్రువయినా చూస్తే నీ గతి ఏం అవుతుంది? అనగా తాబేలు "మీ సంగతులు తెలియకనే నేనెంత తల్లడిల్లానో, ఎంతసేపుఎదురు చూసానో, ఎంత దుఃఖించానో తెలుసా? మీలో ఒక్కరైనా రాకపోతిరి, అందువల్ల మనసు ఉండలేక బయలుదేరి వచ్చాను" అన్నది బాధతో.

స్నేహితులు నలుగురు ఇంటిదారి పట్టారు. ఇంతలో వల నుండి తప్పించుకుపోయిన లేడిని వెదుకుతూ వేటగాడు వెనుకనుండి వస్తున్నాడు. అదిచూచి కాకి "అయ్యో కొంపమునిగింది, వేటగాడు వస్తున్నాడు పారిపోండి. ఎవరిని వారు కాపాడుకోండి అనిహెచ్చరించింది. లేడి తన కాళ్ళకు బుద్దిచెప్పి పరుగుతీసింది. ఎలుక ఒక కన్నంలో దూరింది. కాకి చెట్టెక్కేసింది, తాబేలు మాత్రం ఏదారీ తోచక నెమ్మదిగా నడుస్తూ వేటకానికి దొరికింది. వాడు దానిని పట్టుకొని తన వింటి కొనకు కట్టివేసి భుజంపై పెట్టుకొని వెళుతున్నాడు. అది చూచి కాకి, లేడి, ఎలుక మూడు ఎంతో విచారించాయి. వేటగాని నుండి ఎలాగైనా తాబేలును విడిపించడానికి ఒక ఉపాయం ఆలోచించి అమలు చేసాయి. వేటగాడు వచ్చు త్రోవలో చెరువు గట్టున చిత్రంగుడు ఊపిరి బిగపట్టి, కాళ్ళు చాచుకొని చచ్చినట్లు పడిఉంది. కాకి దాని కనులు పొడుచుచున్నట్లు నటించింది.

ఇంతలో వేటగాడు అచటకు వచ్చి, లేడి నిజంగా చచ్చినదని భావించి, తాబేలు కట్టివున్న వింటిని, బాణమును కిందపెట్టి లేడిని తీసుకుపోవుటకు దానిని సమీపించాడు. వెంటనే ఎలుక తాబేలు వద్దకు వెళ్లి దానికి కట్టిన తాడును కొరికి తక్షణం చెరువులోకి పొమ్మని హెచ్చరించింది. మందరుడు వెంటనే చెరువులోకీ, హిరణ్యకుడు కలుగులోకి పోయారు. వేటగాడు దరికి రాగానే కాకి పైకి ఎగిరి 'కావ్ కావ్'మని అరిచింది. లేడి వెంటనే లేచి పిక్కబలం చూపి పరుగు తీసింది. ఈ చిత్రం చూచి వేటగాడు ఆశ్చర్యపోయాడు. వెనుదిరిగి విల్లు బాణాలు పెట్టిన చోటికి వచ్చాడు. వాటి కొనకు కట్టిన తాబేలు మాయమవడం గ్రహించి మరింత ఆశ్చర్యపోయాడు. చేసేది లేక ఇంటిదారి పట్టాడు.

వేటగాడు పోయిన కొంతసేపటికి నలుగురు స్నేహితులు మళ్ళీ కలుసుకొన్నారు. హిరణ్యకుడు పన్నిన చిన్న ఉపాయాన్ని కాకి వల్ల తెలుసుకొని "మిత్రమా! నీ బుద్ది బలంతో నా ప్రాణం కాపాడావు, లేనిచో నా బతుకు నేటితో ముగిసియుండేది. నీ మేలు ఎన్నటికీ మరువలేను" అని ఎంతో మెచ్చుకొంది. హిరణ్యకుడు "మిత్రమా! కష్టంలో కాపాడటమే నా స్నేహధర్మం. నా విధి నేను నిర్వర్తించాను, ఈ మాత్రం దానికి పొగడ్తలెందుకు" అని అన్నది. ఆ తర్వాత ఆ నలుగురు మిత్రులు మరింత స్నేహంగా ఆనందంగా ఎంతోకాలం జీవించారు.

రాకుమారులారా! చెడు సహవాసం సులభంగా దొరుకుతుంది, క్షణంలో విడిపోతుంది. మంచి స్నేహం లభించడం చాలా కష్టం. చెడు స్నేహం ప్రొద్దుటి నీడలా మొదట గొప్పగా తరువాత తక్కువగా వుంటుంది. సజ్జనుల సావాసం సాయంకాలం నీడవలె మొదట్లో కొద్దికొద్దిగా రానురాను పెద్దదిగా వృద్ది చెందుతుంది. మీరు నలుగురు కాకి, తాబేలు, ఎలుక, జింక మొదలగువానిలా కలిసిమెలిసి ఉండండి. జీవితంలో మంచి మిత్రులను సంపాదించుకోండి. మిత్రలాభాన్ని మించిన సంపద మరొకటి లేదు ఈ లోకంలో. ఈనాటికి మిత్రలాభమనే కథలు చాలు, రేపటి నుండి మిత్రాబేదానికి సంబందించిన కథలు చెపుతాను. ఇక విశ్రాంతి తీసుకోండి అని విష్ణుశర్మ రాకుమారులకు చెప్పాడు.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము