(Telugu) రామయ్య-రంగయ్యల కథ

[:te]ఒక నగరంలో రామయ్య, రంగయ్య అనే వర్తకులిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకసారి రామయ్యవ్యాపార నిమిత్తం దూర దేశాలకు వెళ్తూ తన వద్దనున్న వంద టన్నుల లోహమును తన స్నేహితుడైన రంగయ్యకు ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పి తాను ఊరు వెళ్ళిపోయాడు.

కొంతకాలం తర్వాత రామయ్య సొంత ఊరుకి తిరిగి వచ్చి మిత్రుని ఇంటికి పోయి "మిత్రమా! నాకు విదేశీ వ్యాపారం కలిసి రాలేదు. అందుకని తిరిగి మన ఊరిలోనే మునుపటి లోహ వ్యాపారం చేయదలచాను. నేను నీ వద్ద దాచి ఉంచిన లోహం నాకు ఇమ్ము" అని అడిగాడు. "అయ్యో మిత్రమా! ఈ ఏడు ఎలుకల బాధ ఎక్కువైంది. మా ఇంటిలోని వస్తువులతో పాటు నీ లోహమంతయు అవితిని పొట్టన పెట్టుకొన్నవి. ఈ మాట నీకు చెప్పటానికి నోరు రాలేదు. నేనెంతగానో చింతించాను" అది ఆ దేవునికే తెలుసు అంటూ ఆ రంగయ్య కంటతడి పెట్టాడు.

మిత్రుడు తనను మోసం చేశాడని రామయ్య గ్రహించి "వీనితో తగువు పడుట కంటే సమయం చూచి దెబ్బకు దెబ్బ తీయుట మంచిది" అని భావించి, "నా దురదృష్టమునకు నీవేమి చేయగలవు రంగయ్య! జరిగిన దానికి చింతించి లాభం లేదు. నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది" అని పలికి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు తన మిత్రుడైన రంగయ్య ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. ఒకనాడు రామయ్య మిత్రుని ఇంటికి వచ్చి అతని కుమారుని చూచి ఎత్తికొని ముద్దాడి బజారుకి తీసుకునిపోయి మిఠాయిలు కొనిస్తాను అన్నాడు. ఆ బాబుని తీసుకొని బజారుకి తీసుకెళ్ళాడు. పిల్లవానినొక స్నేహితుని ఇంటిలో దాచి తానొక్కడే రంగయ్య ఇంటికి వచ్చి, మిత్రమా! నీ పిల్లవానికిమిఠాయిలు కొనిపెట్టి తిరిగి వచ్చుచుండగా ఎక్కడనుండో ఒక పాడు గద్ద రివ్వున వచ్చి బాలుని తన్నుకొని పోయినది. నీకు చెప్పడానికి నోరు రాకున్నది. ఏమి చేయుదువు?" అంటూ రామయ్య బాధపడుతూ చెప్పాడు.

రంగయ్య కోపంతో వెంటనే రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజు రామయ్యను పిలిపించి "ఏమోయ్! పిల్లవానిని గ్రద్ద తన్నుకొని పోయినదని చెప్పావంట, అది నమ్మతగ్గ విషయమేనా? అని గద్దించాడు రాజు. "ప్రభూ! వంద టన్నుల లోహమును ఎలుకలు తినివేయగా లేనిది, బాలుని గ్రద్ద తన్నుకుపోవుటలో ఆశ్చర్యమేముంది? కావాలంటే నిజమో కాదో రంగయ్యనే అడిగి చుడండి" అన్నాడు. రాజు జరిగిన కథ అంతయు విని రంగయ్యను గట్టిగా మందలించి రామయ్యకు ఇవ్వవలసిన లోహమును తెప్పించి ఇప్పించాడు. తరువాత రామయ్య, రంగయ్య కొడుకును తెచ్చి అతనికి అప్పగించాడు.

కాబట్టి, మోసమును మోసంతోనే జయించాలి. నీ మిత్రభేద తంత్రమునకు పింగళకుడో సంజీవకుడో చావడం ఖాయం, చూచి ఆనందించుము" అంటూ కరటకుడు దమనకునితో చెప్పాడు. సంజీవకుని కొమ్ము పోటుతో మూర్చపోయిన పింగళకుడు కొంతసేపటికి తేరుకొని తనకు కలిగిన పరాభవమునకు సహించలేక పెద్దగా గర్జించి సంజీవకుని పైకి దూకి ఆవేశంతో అతని పొట్ట చీల్చి చంపాడు. దమనకుడు నెమ్మదిగా పింగళకుని వద్దకు పోయి నిలిచాడు. పింగళకుడు ముందూ వెనుక ఆలోచింపక సంజీవకుని చంపి పాపము మూటకట్టుకుంటిని. విష వృక్షమైననూ పెంచిన చేతులతో త్రుంచరాదని పెద్దలు చెప్పారు కదా! గుణవంతుడగు సేవకుని శిక్షించుట రాజుకెంతో హానికరము. సంజీవకుని చంపి శాశ్వతమైన అపకీర్తి పాలైతి"నని చింతించుచుండగా దమనకుడు "మహారాజా! మీకు చెప్పతగినవాడను కాదు. శత్రువుని చంపి విచారించువారు ఎక్కడైనా ఉన్నారా? ద్రోహము చేయదలచిన వాడు కొడుకైనా, తండ్రియైననూ, తమ్ముడైననూ రాజు శిక్షించవలసినదే కాని జాలిపడరాదు. ఇది రాజధర్మము" అని ఓదార్చాడు. పింగళకుడు మనస్సు కుదుటబరచుకొని క్రమంగా ఎప్పటివలె రాజ్యపాలన చేయసాగాడు.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము