(Telugu) ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
తాత్పర్యం: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారంచేసేవాడే నేర్పరి.
చూసారుగా..పైన పద్యాన్ని..మీకేమనిపిస్తుంది? అదంతా నిజమే కానీ, ఈ రోజుల్లో అంత మహాత్ములెవరుంటారు? ఒకవేళ అలా చేద్దామనుకున్నా అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో బతకలేరు. ఇప్పటి పరిస్థితులు అలాంటివి మరి. ఏం చేస్తాం?? అని ఒక నిట్టూర్పు విడుస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో సరిగ్గా చెప్పానా? :)
నాకయితే ఎవరికీ ఉపకారం చేయకపోయినా ఫరవాలేదు కానీ, అపకారం మాత్రం చేయకుండా ఉండగలిగితే చాలు అనిపిస్తుంది.
మనం ప్రపంచంలో జరిగే చాలా సంఘటలని చూసినప్పుడల్లా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం అసలెటుపోతోంది? ఏమిటీ విపరీత సంఘటనలు..అనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరి మీదో కోపంతో ఎవరో బాంబులు పెట్టి, దానికి అభం శుభం తెలియని సామాన్య ప్రజలు పార్కుల్లోనూ, హోటళ్ళలోనూ , రోడ్ల మీద ఇలాంటి మామూలు ప్రదేశాల్లో బలి అయిపోతుంటే చాలా బాధేస్తుంది. కానీ, ఏమి చెయ్యాలో అర్ధం కాదు. మతాల పేరు మీద, దేవుడి పేరు మీద, రాజకీయ పార్టీల పేరు మీద, చివరికి సినిమా హీరోల మీద అభిమానం తో కూడా గొడవలు చేసే స్థాయికి ఎదిగాం మనం. వీటన్నిటికీ పురికొల్పబడే ముందు, ఒక మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించగలిగినా ఈ అనర్ధాలన్నింటిలో చాలా వరకు జరగవు కదా..!
అసలు ఈ ప్రకృతి సృష్టిలో ఎన్నో అపాయాలు ప్రాణుల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఎప్పుడేమి జరుగుతుందో ఎవరం చెప్పలేము. అలాంటప్పుడు బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడుపుతూ, ఎదుటి వారిని బాధపెట్టకుండా బ్రతకచ్చుగా... ఈ సృష్టిలో ఏదో అతీంద్రియ శక్తి అన్నీ జీవరాసుల్నీ నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తినే మనం దైవం అంటాం. దేవుడనే వాడు మనం ఏ రూపంలో ఉన్నాడనుకుంటే ఆ రూపంలో మనకి కనిపిస్తాడు. ఏ మతం ఏ సూక్తులు చెప్పినా చివరికి నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, మతాలన్నీ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికీ, లోక కళ్యాణానికీ ఉద్దేశించబడినవే కదా..!
నా ఇల్లు, నా కుటుంబం, నా వాళ్లు అనుకుని నీవాళ్ళ సుఖం కోసం పాటుపడాలి. అంతే కానీ, ఏ స్వాభిమానం మితిమీరి మా ఊరు, మా రాష్ట్రం, మా భాష అనే అభిమానం కాస్తా వేరే వారి మీద ద్వేషానికి దారితీసేంత స్థాయికి వెళ్ళకూడదు కదా..!
మొత్తానికి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్నో జరుగుతున్నా, ఇంకా చాలా మంది మనుషుల్లో మానవత్వం ఉందని నేను నమ్ముతున్నాను. అదొక్కటే కాకుండా ఎందరో మహానుభావులు తమకి ఏ రకంగా సంబంధంలేని శరణార్ధులను ఆదుకుంటున్నారు. వారికోసమే తమ తమ జీవితాలని వెచ్చిస్తున్నారు. అలాంటి మహానుభావులందరూ మనకి తెలిసుండకపోవచ్చు. కానీ, చాలా మంది ఉన్నారు. వాళ్ల అందరి పుణ్యం వల్లే మనలాంటి మామూలు మనుషులకి ఇంకా అన్నం దొరుకుతుందని నాకనిపిస్తూ ఉంటుంది.
[:]
Comments
Post a Comment