భోజ రాజు

ధారాపురం అనే మహా నగరానికి  రాజు  భోజరాజు.  అతను గొప్ప పరాక్రమమం కలవాడు.  అంతటి సద్గునవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరుపొందాడు.  అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు  నీతిమంతుడు.




క్రూర  మృగాల వల్ల  ప్రజలకు   కష్టనష్టాల గురించి విన్న భోజరాజు  తన మంత్రి నీతిమంతుని పిలిచి  క్రూర మృగాల వేటకు వెళ్ళటానికి  అంతా సిద్దం చేయమని చెప్పాడు. వేటకు కావలసిన అన్ని పరికరరాలతో తగిన సైన్యంతో  బయల్దేరారు  భోజరాజు  నీతిమంతుడు. అడవిలో డప్పులూ, తప్పెట్ట్లూ వాయించారు సేవకులు పులులు,  సింహాలు, ఎలుగుభంట్లూ, పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు.  చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు. రాజు  తన పరివారంతో  రాజధానికి  తిరిగి వెళ్ళసాగాడు.  వాళ్ళు ఓ చోట  జొన్న చేను పక్కగా వెళుతున్నారు.  అక్కడ మంచెపై కూర్చుని  ఉన్న ఆచేను యజమాని ఐన  ఓ బ్రాహ్మణుడు  వీళ్ళను చూసి  “రాజా మీరు మీ సైన్యం ఎండనపడి వెళుతున్నారు  అలసిపోయి  ఉన్నారు,  జొన్నచేను కంకులు తినడానికి సిద్దంగా ఉన్నాయి   సందేహం లేకుండా  అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని   విశ్రాంతి తీసుకుని వెళ్ళండి.   మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం”   అంటూ ప్రార్థించాడు.


రాజు ఆ బ్రాహ్మడి  ఔదర్యానికి ఎంతో సంతోషించి    ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని   తన పరివారంతో చెప్పాడు.
రైతు కాసేపటి తరువాత ఏదో పనిపై  మంచెపైనుండి  దిగి వచ్చాడు. తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతడికి దుఖం ముంచుకు వచ్చింది.  సరాసరి రాజు వద్దకు వెళ్ళి “రాజ ఇదేమిటి, ధర్మవంతుడివి అని నీకు పేరు,  నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు.  ఇది నీకెలా న్యాయంగా తోచింది?  నేను పేదవాడిని   కష్టపడి  జొన్న చేను పెంచుకున్నాను.  ఇదే నా ఆధారం.   కంచే చేను మేసినట్టుగా  ఇతరులకు  చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది?  ఇప్పుడు నేనూ నాకుటుంబం జీవించేదెలా?”   అంటూ విలపించసాగాడు.

అతడి మాటలు వింటూ  ‘అందరినీ పిలిచి తినమన్నది ఇతడే, ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి!  తన పరివారంపై తప్పు నెడుతూ ఇతనిలా ప్రవర్తించటమేమిటీ’  అనుకుంటూ తన వాళ్ళనందరినీ   కంకులు తినటం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు. ఆ  రైతు  దుఖం చూడలేక  అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు.
ఆ రైతు పిట్టలను తోలటానికై తిరిగి మంచె మీదకు చేరాడు.  వెళ్ళిపోతున్న  రాజు గారి పరివారాన్ని చూసి  “ఎందుకు వెళ్ళిపోతున్నారు?  విరగకాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పానుకదా,  కడుపార తిని కావలసినన్ని పట్టుకుపొండి. రాజా  మీ పరివారానికి మీరు చెప్పండి. పరులకు ఉపకారం చేయని నా జన్మ వృదా”   అన్నాడు.ఈ బ్రాహ్మణ రైతు వెర్రివాడేమోనన్న సందేహం రాజుకి కలిగింది.  చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు.  సరే కానిమ్మని  తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపించాడు.  రైతు సంతోషించాడు. తిరిగి కాసేపటితరువాత మంచె దిగివచ్చిన  రైతు  “ధర్మవంతుడైన  రాజు లక్షణం ఇదేనా? నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సాహించటమేమిటి? నా  పంట నాశనం చేస్తున్నారు   నేనేం నేరం చేసానని నాకీ శిక్ష.”   అంటూ భోరాజు ను నిలదీసి అడిగాడు.భోజ రాజు ఆశ్చర్యంతో  తన మంత్రియైన  నీతిమంతుని తో   “ఈ రైతు ప్రవర్తన  విపరీతముగా ఉన్నది. మంచెపై ఉన్నప్పుడు ఒకమాదిరిగా,  మంచె దిగిన తరువాత మరొక విధముగా  ప్రవర్తిస్తున్నాడు. మంచెపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించినవాడు   మంచె దిగగానే అంతా మచి ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో  అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది?”   అంటూ అడిగాడు. దానికి సమాధానంగా మంత్రి రాజా   “ఇతడి ఈ ప్రవర్తనకి కారణం  తప్పకుండా ఆ మంచెయే ననిపిస్తున్నది.  మంచె దిగగానే అతడిలోని ఉదారత్వము పోయి సామాన్య  రైతులా ప్రవర్తిస్తున్నాడు. ఆ మంచె ఉన్న స్థలాన్ని పరీక్షించి గానీ ఆ  మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు.”   అన్నాడు.

రాజు వెంటనే బ్రాహ్మణుతో    “ఈ భూమిని నాకు ఇవ్వు ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైన్నా కొనుక్కొనేంత ధనం ఇస్తాను”  అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ రైతుకి  రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి, “ రాజా మీ ఇష్టం నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే, మీ దయ వలన ఆ ధనంతో  నేనూ నా కుటుంబం సుఖంగా ఉంటాము”    అని చెప్పాడు.

రాజు ధారాపురానికి చేరుకుని రైతుకి చాలా ధనం ఇచ్చి  సేవకులను పంపి ఆ మంచెఉన్న చోటును తవ్వించాడు. అక్కడ వారికి ఒక అద్భుత మైన రత్నాలు పొదగబడిన  బంగారు సింహాసమ్నం ఒకటి  కనిపించింది. దానికి ముఫైరెండు బంగారు మెట్లు ఉన్నాయి.  ఆ మెట్లకు  రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. ఆ సింహాసన్నాని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆ సింహాసనం పుర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక (ప్రతిమ) ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. ఇంత అద్భ్త సింహాసనాన్ని అధిష్టించిన రాజు  ఈ భూమినంతటినీ  ఏకచ్చత్రాధిపత్యంగా  ఏలిన వాడై ఉండాలి. అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్నచోట మంచె పై కూర్చున్న ఆ రైతుకి తెలియకుండానే ఎంతో ఉదారత్వముతో ప్రవర్తించేవాడు  అని  గ్రహించారు.


ఆ సింహాసనాన్ని తమతో జాగ్రత్తగా  నగరానికి  తీసుకుపోయి  తాను దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు భోజరాజు. పండితులచే ఒక  శుభముహుర్తం  నిర్ణయించి  ఆ సింహాసనాన్ని అధిరోహించటానికై శుభలగ్నాన మంగళవాద్యాలతో  సింహాసనానికి పూజలు జరిపించి   మంచి ముహుర్తం లో  ఆ సింహాసనం మెట్టుపై కాలు పెట్టబోయాడు.  వెంటనే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరగింది.  మొదటిమెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి. ఆ మెట్టుపైనున్న  రత్నఖచితమైన బొమ్మ రాజుతో మాట్లాడసాగింది.  రాజు అత్యంత ఆశ్చర్యంతో బొమ్మ మాటలు వినసాగాడు.


“రాజా సామాన్యులకు ఈ సింహాసనాన్ని అదిరోహించటం  అంత సులువైన విషయంకాదు.  శౌర్య ప్రతాపాలు, సకల గుణవంతుడు ఐన విక్రమార్క మహారాజు సింహాసనం ఇది. ఇది మాన నిర్మితంకాదు,  స్వయంగా దేవేంద్రుడే  విక్రమార్కుడికి ఇచ్చిన సింహాసనం ఇది. దీనిపై కూర్చోవాలనుకునే వారు  అతడితో సమానులై ఉండాలి. దీనిపై ఉన్న ముఫై రెండు బొమ్మలూ మాట్లాడతాయి దానికి కారణం  ముందు ముందు  నీకే తెలుస్తుంది.





సకల ప్రావీణ్యుడూ, దిక్‍దిగాంతాలవరకూ ఖ్యాతి గాంచినవాడు.సుగుణ వంతుడూ ఐన విక్రమార్కుడి లక్షణాలు నీకున్నవని అనుకుంటే ఈ సింహాసన్నాని అధిరోహించు, లేదా నీకు ప్రమాదం తప్పదని గుర్తుంచుకో.”   అంది.
భోజరాజు ఆ బొమ్మమాటలకు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు  “విక్రమార్కుడు ఎవరో అతడి చరిత్రఏమిటో నాకు తెలియదు. నేను అతడి వలె సుగుణవంతుడినో లేదో నువ్వే నిర్ణయించాలి. నాకు అతడి చరిత్ర చెప్పు”   అన్నాడు.
దానికి ఆ బొమ్మ బదులిస్తూ  “అతడి గుణగణాలు వర్ణించడం అంతసులభంకాదు, నా శక్తి మెరకు చెపుతాను”   అంటూ ఇలా చెప్పసాగింది…


అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ " మహారాజా! నా పేరు వినోదరంజిత ప్రతిమ. నేను ఈ మొదటిమెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టి తో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేసాడు. అతని గుణగణాలు వర్ణించనలవి కాదు. అతను పరమ సాహసోపేతుడు. అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరు లేకపోటం చేతనే ఇది భూమిలోకి క్రుంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని, దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం" అన్నది.

అందుకు భోజరాజు "ఓ వినోదరంజితా, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు తెలియచేయండి" అని వేడుకున్నాడు.

అలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన 32 కథలే ఈనాడు "భట్టి విక్రమార్క" కథలు గా "భేతాళ" కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి.

ఇంకో విషయం ఏమిటి అంటే 32 సాలభంజికలకు 32 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే :

1. వినోదరంజిత 2. మదనాభిషేక 3. కోమలవల్లి 4. మంగళ కళ్యాణి
5. మంత్ర మనోరమ 6. శృంగార మోహనవల్లి 7. జయ  8. విజయ
9. మలయవతి  10. ప్రభావతి  11. విద్వత్శిరోమణి 12. శాంతగుణవల్లి
13. సూర్యప్రకాశవల్లి 14. పూర్ణచంద్రవల్లి 15. అమృతసంజీవివల్లి 16. కృపాపరిపూర్ణవల్లి
17. కరుణాకరవల్లి 18. పరిమళమోహనవల్లి 19. సద్గుణవల్లి 20. సుందరవినోదవల్లి
21. కనకరంజితవల్లి 22. పంకజవల్లి 23. అపరాజితవల్లి 24. మనోరంజితవల్లి
25. స్వర్ణకాంతవల్లి 26. సకలకళావల్లి 27. మాణిక్యవల్లి 28. మనునీతివల్లి
29. సంప్రదాయవల్లి 30. రుక్మిణీవల్లి 31. నీతివాక్యవల్లి 32. ఙ్ఞానప్రకాశవల్లి

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము